Update #3
*అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవే శాలకు నిర్వహించే పాలిసెట్-2025ను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.*
*ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీనిని నిర్వహిస్తారు.*
*దీనికి 1.50 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.*
Update #2
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో స్పల్ప మార్పు చోటు చేసుకొంది. ఫిబ్రవరి 28వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టునున్నారు. అసలు అయితే ఈ బడ్జెట్ను మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించారు. కానీ బడ్జెట్ను నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
24వ తేదీ నుండి ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అలాగే 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
Update #1
*ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్ ల స్థానంలో ఒకటే యాప్*
*పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వ్యవస్థ!*
*పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్!*
*పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు*
అమరావతిః ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ లో పూర్వ విద్యార్థిసంఘాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలకు ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం, మౌలిక వసతుల అవసరాలను తెలియపరిచి, నేరుగా పాఠశాలలు, కళాశాలలకే దాతల విరాళాలు అందే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, నిధుల వినియోగం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి కంప్యూటర్ ల్యాబ్ లు, స్టెమ్ ల్యాబ్ లు, స్కూల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
*పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్*
ఉపాధ్యాయులకు ఇప్పుడు 45 యాప్ ల స్థానంలో ఒకే యాప్ ను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సీఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డ్యాష్ బోర్డ్ రూపొందించాలన్నారు. మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్ లు రూపొందించి, ఒకే సమాచారాన్ని పదేపదే సేకరించే పద్ధతికి స్వస్థి పలకాలని, ఉపాధ్యాయుల సమయాన్ని విద్యార్థుల కోసం సద్వినియోగపరుచుకునేలా చూడాలని ఆదేశించారు. జీవో 117 ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్టస్థాయిలో ఏర్పాటుచేసి ఒక క్లాస్ కు ఒక టీచర్ ను కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.